అసెంబ్లీ సమావేశాలు ఈనెల 12న ప్రారంభం కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లుపై చర్చ జరగనున్న నేపథ్యంలో ఈ సమావేశాలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ బిల్లును ఎలాగైనా అడ్డుకుని తీరతామని సీమాంధ్ర ఎమ్మెల్యేలు ప్రకటించిన నేపథ్యంలో ఏం జరగనుందా అని ఉత్కంఠ నెలకొంది. అయితే బిల్లుకు ఎలాంటి అడ్డంకులూ రాకుండా చూసే దిశగా ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం వ్యూహరచన చేస్తోంది. దీనిపై స్థానిక నేతలకు దిశానిర్దేశం చేసేందుకు ఈనెల 12న కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ దిగ్విజయ్ సింగ్ రాష్ట్రానికి రానున్నారు. ఈ బిల్లుకు అనుకూలంగా వ్యవహరించాలని, ఒకవేళ బిల్లుపై ఓటింగ్ జరిగినా అనుకూలంగా ఓటేయాలని ఇప్పటికే ఆయన కొందరు సీమాంధ్ర నేతలతో మంతనాలు చేస్తున్నారు. అలా సహకరించినవారికి ఏర్పడబోయే కొత్త రాష్ట్రంలో పదవుల పందేరం చేస్తారని తాయిలాలు ఎర వేస్తున్నారని సమాచారం. మరోవైపు విభజన బిల్లు రాష్ట్ర శాసనసభకు రాగానే అసెంబ్లీని ముట్టడిస్తామని ఏపీఎన్జీవోలు ప్రకటించిన నేపథ్యంలో అసెంబ్లీ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన సోమవారం స్పీకర్ నాదెండ్ల మనోహర్ తో పోలీసు ఉన్నతాధికారులు భేటీ అయి చర్చించారు. మొత్తమ్మీద ఈ అసెంబ్లీ సమావేశాలు ఎలా సాగుతాయో అనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
No comments:
Post a Comment