తెలంగాణ బిల్లుపై చర్చ ఎప్పుడు జరుగుతుందా అనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లు గురువారం సాయంత్రమే రాష్ట్రానికి చేరినా, అది శుక్రవారం ఉదయానికి కూడా అసెంబ్లీకి చేరలేదు. కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి చేరిన బిల్లు ప్రతులు.. అక్కడ నుంచి గవర్నర్ కు వెళ్లి ఆయన నుంచి అసెంబ్లీకి చేరుతుంది. అయితే శుక్రవారం ఉదయం 11 గంటల సమయానికి కూడా బిల్లు అసెంబ్లీకి చేరకపోవడంతో తెలంగాణ ప్రాంత నేతలు ఆందోళన వ్యక్తంచేశారు.
ఇదీ చదవండి: ప్రత్యేక విమానంలో వచ్చిన బిల్లు
డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ.. సీఎస్ కు ఫోన్ చేసి బిల్లు ఇంకా పంపకపోవడానికి గల కారణాలు ఏమిటని అడిగారు. బిల్లు ప్రతులు గవర్నర్ కు పంపిస్తున్నామని, అక్కడి నుంచి అసెంబ్లీకి చేరుతుందని, మొత్తమ్మీద మూడు గంటల్లోగా బిల్లు అసెంబ్లీకి చేరేలా చర్యలు తీసుకుంటున్నామని సీఎస్ బదులిచ్చారు. ఒకవేళ బిల్లు మధ్యాహ్నానికి అసెంబ్లీకి వచ్చినా, దానిపై శుక్రవారం చర్చ జరిగే అవకాశం కనిపించడంలేదు. ఈ నేపథ్యంలో సోమవారమే తెలంగాణ బిల్లు చర్చకు వచ్చే అవకాశం ఉంది.
No comments:
Post a Comment