ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానంపై తిరుగుబావుటా ఎగురవేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లు, 2013కి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన రెండు రోజుల తర్వాత పెదవి విప్పిన సీఎం.. అధిష్టానంపై తీవ్రంగా మండిపడ్డారు. రెండుసార్లు మిమ్మల్ని గెలిపించడమే మేం చేసిన పాపం అంటూ ప్రశ్నాస్త్రాలు సంధించారు. శనివారం విజయవాడలో జరిగిన పులిచింతల ప్రాజెక్టు ప్రారంభోత్సవ సభలో ఆయన ఆవేశపూరితంగా ప్రసంగించారు. తాను సీఎంగా ఉండగా రాష్ట్ర విభజనకు అంగీకరించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
రాష్ట్రాన్ని విభజిస్తే నక్సలిజం పెరుగుతుందని ఇంటెలిజెన్స్ బ్యూరో చెబుతున్న విషయాన్ని ప్రస్తావించారు. అలాగే నీటి యుద్ధాలు కూడా తప్పవన్నారు. ఇప్పటికే పొరుగు రాష్ట్రాలతో నీటి సమస్యలపై వివాదాలు ఉన్నాయని, ఇప్పుడు రాష్ట్రాన్ని విభజిస్తే ఇన్నాళ్లూ అన్నదమ్ములుగా ఉన్న తెలుగుప్రజలు కూడా కొట్టుకునే పరిస్థతి వస్తుందని హెచ్చరించారు.
అధికారం కోసం కేసీఆర్ తో పొత్తు పెట్టుకోవాలని, అది సరిపోకపోతే జగన్ తోనూ కలవాలని, అది కూడా చాలదంటే చంద్రబాబుతోనైనా చేతులు కలపాలని.. అంతేకానీ రాష్ట్రాన్ని మాత్రం విభజించొద్దని స్పష్టంచేశారు. ఢిల్లీలో ఉన్నవారికి కళ్లు, చెవులు పనిచేయడంలేదని, వారికి కళ్లు తెరుచుకునేలా, చెవులు వినిపించేలా చేద్దామని గట్టిగానే మాట్లాడారు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లును ఓడిస్తామని, ఓడించిన బిల్లును పార్లమెంటులో ఎలా ఆమోదిస్తారో చూద్దామని వ్యాఖ్యానించారు. కావాలనుకుంటే ఎవరినైనా ముఖ్యమంత్రి చేసుకోవాలని, రాష్ట్రాన్ని మాత్రం విభజించొద్దని పేర్కొన్నారు.
Tags: CM kiran kumar reddy speaks against high command, CM Kiran on Jagan, CM Kiran controversial comments, CM Kiran on Chandra Babu, CM Kiran on KCR
No comments:
Post a Comment