సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు అధిష్టానానికి ఝలక్ ఇచ్చారు. యూపీఏ సర్కారుకు వ్యతిరేకంగా అవిశ్వాశ తీర్మానం ఇచ్చారు. దీనికి సంబంధించిన నోటీసుపై ఆరుగురు కాంగ్రెస్ ఎంపీలు సంతకాలు చేసి లోక్ సభ స్పీకర్ మీరాకుమార్ కు అందజేశారు. దీంతో రాష్ట్ర విభజన విషయంలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకున్నట్టయింది. మరోవైపు సీమాంధ్రకు చెందిన తెలుగుదేశం పార్టీ ఎంపీలు కూడా విడిగా అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారు. వాస్తవానికి యూపీఏ సర్కారుకు తమ మద్దతు ఉపసంహరిస్తామని గతంలో ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఓ ప్రకటన చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన ముసాయిదా బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఆ పని చేయాల్సిన సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు కాస్త వెనక్కి తగ్గి సొంత పార్టీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారు. అయితే ఇక్కడ కూడా వారిలో ఏకాభిప్రాయం లేకపోవడం గమనార్హం. మొత్తం సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలందరూ నోటీసు ఇచ్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం లగడపాటి రాజగోపాల్, సబ్బం హరి, సాయిప్రతాప్, హర్షకుమార్, రాయపాటి సాంబశివరావు, ఉండవల్లి అరుణ్ కుమార్ మాత్రమే ఆ నోటీసుపై సంతకాలు చేశారు. అంతకుముందు వారు స్పీకర్ మీరాకుమార్ ను కలిసి గతంలో తాము చేసిన రాజీనామాలను ఉపసంహరించుకున్నారు. అయితే వీరంతా సీరియస్ గానే అవిశ్వాస తీర్మానం పెట్టారా లేక పబ్లిసిటీ స్టంట్ కోసం ఇదంతా చేస్తున్నారా అనేదానిపై రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం కిరణ్ త్వరలో పెట్టబోయే పార్టీలో వీరంతా చేరతారని, అందుకు సంబంధించిన ముందు జాగ్రత్త అడుగే ఈ అవిశ్వాస తీర్మానం అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరోవైపు సొంత పార్టీ సభ్యుల నుంచి ఈ అవిశ్వాసం ఊహించేందనని, దానిని తాము అధిగమిస్తామని కాంగ్రెస్ నేత పీసీ చాకో వ్యాఖ్యానించడం వీటికి బలం చేకూరుస్తోంది. వీరు ప్రవేశపెట్టిన అవిశ్వాసం ముందుకెళ్లాలంటే కనీసం 50 మంది సభ్యలు మద్దతు కావాలి. మరి వారు అంత మద్దతూ కూడగడతారా లేక కాడి మధ్యలోనే పాడేస్తారా వేచి చూడాల్సిందే.
No comments:
Post a Comment