ఢిల్లీలో సామాన్యుడు తన శక్తి ఏంటో చూపించాడు. దశాబ్దంన్నరగా అధికారాన్ని అనుభవిస్తున్న హస్తాన్ని చిత్తు చేశాడు. రాజకీయాల్లోకి వస్తూనే కాంగ్రెస్ ను ఊడ్చి పడేశాడు. అతడే.. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్. సామాన్యుడి తరఫున రాజకీయాల్లోకి వచ్చి, పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే తన శక్తి ఏంటో చూపించాడు. 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో 28 స్థానాలు గెలుచుకుని విమర్శకులు ప్రశంసలు కూడా అందుకున్నాడు. ఆప్ దెబ్బకు కాంగ్రెస్ దాదాపు తుడిచిపెట్టుకుపోగా, ఈ సారి తమకు అధికారం ఖాయమని అంచనా వేసిన బీజేపీ సైతం ఆప్ ధాటికి తట్టుకోలేకపోయింది. అరవింద్ పార్టీ కారణంగా మెజారిటీకి అరడుగు దూరంలో ఉండిపోయింది. చాలా చోట్ల కాంగ్రెస్ వ్యతిరేక ఓటును ఆప్ కొల్లగొట్టడంతో బీజేపీ డీలా పడింది. ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కమలం పార్టీకి ఇంకా మూడు సీట్లు కావాలి. అయితే తాము నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని కేజ్రీవాల్ ప్రకటించారు. దీంతో ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటు ఎలా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. కాంగ్రెస్ సభ్యులను చీల్చడం మినహా బీజేపీకి మరో దారి లేకుండా పోయింది. సోమ లేదా మంగళవారం దీనిపై స్పష్టత రానుంది.
No comments:
Post a Comment