కేంద్ర మంత్రి చిరంజీవి (ఆయన రాజీనామా ఇంకా ఆమోదం పొందులేదు కనుక) ప్రస్తుత పరిణామాలపై ఎందుకు మౌనంగా ఉంటున్నారు? కనీసం మిగిలిన సీమాంధ్ర ఎంపీలు వెళుతున్న దూకుడు(?) అంత కాకపోయినా నామమాత్రంగా కూడా ఎందుకు స్పందించడంలేదు? ఇవన్నీ చాలామందిలో ఉదయించే ప్రశ్నలు. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకు చాలా తప్పడు నిర్ణయాలు తీసుకున్నారన్నది జగమెరిగిన సత్యం. పోనీ రాజకీయ అనుభవం లేదు కదా అందుకే అలా జరిగిందని సరిపెట్టుకోవడానికి లేదు. బావమరిది అల్లు అరవింద్ మాట విని పార్టీని సర్వ నాశనం చేశారు.(ఇది ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన చాలామంది నేతలు చెప్పిన విషయమే) పోనీ కాంగ్రెస్ లో పార్టీని విలీనం చేసిన తర్వాత అయినా రాజకీయాలు ఒంటబట్టించుకున్నారా అంటే అదీ లేదు. ఏదో తనకు కావాల్సినవారికి పదవులు ఇప్పించుకుని, తను ఓ కేంద్ర మంత్రి పదవి పొంది అంతటితో చాలు అనిపించుకున్నారు. కానీ తననే ఆరాధించిన లక్షాలాది అభిమానులను, తన పార్టీకి ఓటేసిన దాదాపు 17 లక్షల మంది ప్రజలను నట్టేట ముంచారు. పోనీ కేంద్ర మంత్రి పదవి పొందిన తర్వాత అయినా రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటూ ఏదో ఒక నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేశారా అంటే అదీ లేదు. సమైక్య ఉద్యమం ఎగసిపడిన తరుణంలోనూ ఆయన సరిగా పోరాడలేదు. ఏదో నామ్ కే వాస్తే రాజీనామా లేఖ ఇవ్వడం తప్ప. తాజాగా విభజన బిల్లు తయారైన తర్వాత కూడా సీమాంధ్ర నేతలతో కలసి దూకుడుగా అధిష్టానాన్ని ఎదిరించడం మానేసి, వాళ్లనే తప్పుబడుతున్నారు. ఇప్పటికే తన ఇమేజ్ ను ఘోరంగా పాడుచేసుకున్న చిరంజీవి.. తాజా చర్యతో మరింత పాతాళంలోకి వెళ్లిపోయారు. ఇంతకీ ఎందుకు ఇలా చేస్తున్నారంటే.. రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న ఆయన తన శాఖకు సంబంధించి కొన్ని తప్పులు చేశారని, ఇప్పుడు తాను సోనియాను ఎదిరిస్తే, ప్రత్యర్థి పార్టీలను భయపెట్టినట్టే సీబీఐ అనే ఆయుధంతో తనను కూడా ఇరికిస్తారని చిరు భయపడుతున్నాడని వదంతులు వినిపిస్తున్నాయి. అందుకే, ఆయన సోనియాను ఎదిరించడంలేదని చెబుతున్నారు. మరి ఇందులో ఎంత నిజముందో ఆయనకే తెలియాలి.
No comments:
Post a Comment