రాష్ట్ర రాజకీయ యవనికపై మరో కొత్త పార్టీ అవతరించబోతోంది. గత కొంతకాలంగా చెలరేగుతున్న ఊహాగానాలకు త్వరలోనే తెరపడనుంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ కొత్త పార్టీకి అధిపతి. 'జై సమైక్యాంధ్ర పార్టీ' పేరుతో ఆయన ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ దాదాపు తుడిచిపెట్టుకుపోయిన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేస్తే డిపాజిట్లు కూడా గల్లంతు కావడం ఖాయమని ఆ పార్టీ సీమాంధ్ర నేతలకు తెలుసు. అయతే అదే సమయంలో అటు టీడీపీలోకి గానీ ఇటు వైఎస్సార్ సీపీలోకి గాని వెళ్లే పరిస్థితి లేదు. మరోవైపు సార్వత్రిక ఎన్నికలు ముంచుకొచ్చేస్తున్నాయ్. దీంతో కొత్త పార్టీ అనివార్యం కాక తప్పలేదు. ఇందుకు చాలాకాలం నుంచి గ్రౌండ్ వర్క్ జరుగుతోంది. ఇందులో భాగంగానే సీఎం కిరణ్.. అధిష్టానంపై తిరుగుబావుటా ఎగురవేశారు. తాజాగా అధిష్టానం లక్ష్యంగా ఫైర్ అయ్యారు. మరోవైపు సీమాంధ్రకు చెందిన ఆరుగురు కాంగ్రెస్ ఎంపీలు సొంత పార్టీపైనే అవిశ్వాసం ప్రకటించారు. వీరంతా ఒక్కటై కిరణ్ ఆధ్వర్యంలో జై సమైక్యాంధ్ర పార్టీ కింద ఎన్నికలకు వెళ్లాలన్నది వ్యూహం. మరి కొత్త పార్టీకి సీమాంధ్రలో ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాలి.
No comments:
Post a Comment