సార్వత్రిక ఎన్నికల ముందు జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ చిత్తయింది. లోక్ సభ ఎన్నికలకు సెమీ ఫైనల్స్ గా భావించిన ఈ ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల ఫలితాలు ఆదివారం వెలువడ్డాయి. అన్ని రాష్ట్రాల్లో ఓటర్లు కాంగ్రెస్ కు దిమ్మ తిరిగే పాఠం చెప్పారు. ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లలో కాంగ్రెస్ నామరూపాల్లేకుండా పోగా, అక్కడ బీజేపీ తిరుగులేని ఆధిక్యం కనబరిచింది. ఇక ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ దెబ్బకు హస్తం కుదేలు కాగా, అధికారం కైవసం చేసుకోవాలని ఆరాటపడిని బీజేపీ మెజారిటీకి దగ్గరలో ఆగిపోయింది.
230 స్థానాలున్న మధ్యప్రదేశ్ లో బీజేపీ 165 సీట్లు గెలుచుకుని తిరుగులేని ఆధిక్యం సంపాదించింది. ఇక్కడ కాంగ్రెస్ 58 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. బీఎస్పీ 4, ఇతరులు 3 స్థానాలు కైవసం చేసుకున్నారు. 90 స్థానాలున్న ఛత్తీస్ గఢ్ లో 49 స్థానాలతో మెజారిటీకి అవసరమైన సంఖ్యాబలాన్ని చేజిక్కించుకుంది. కాంగ్రెస్ 39 స్థానాలకు పరిమితం కాగా.. బీఎస్పీ, ఇతరులు చెరో ఒక స్థానాన్ని దక్కించుకున్నారు. 200 స్థానాలున్న రాజస్థాన్ లో 199 సీట్లకు ఎన్నికలు జరగ్గా, బీజేపీ ఏకంగా 162 స్థానాల్లో విజయబావుటా ఎగురవేసి భారీ విజయం సొంతం చేసుకుంది. ఇక్కడ కాంగ్రెస్ 21 స్థానాలు మాత్రమే దక్కించుకోవగా.. బీఎస్పీ 3, ఇతరులు 13 స్థానాలు కైవసం చేసుకున్నారు. ఇక 70 స్థానాలున్న దేశ రాజధాని ఢిల్లీలో 32 సీట్లతో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించి, మేజిక్ ఫిగర్ 36కి నాలుగు స్థానాల దూరంలో నిలిచింది. కొత్తగా వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ 28 సీట్లు గెలుచుకుని చరిత్ర లిఖించింది. అధికార కాంగ్రెస్ పార్టీ ఘోరంగా పరాజయం పాలై కేవలం 8 సీట్లకే పరిమితమై ప్రధాన ప్రతిపక్షానికి కూడా దూరంగా ఉండిపోయింది. 15 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉన్న షీలాదీక్షిత్.. తన ప్రత్యర్థి కేజ్రీవాల్ చేతిలో 22 వేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.
No comments:
Post a Comment